సాహితీ యోధుడు డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి – CM KCR

BIKKI NEWS (జూలై – 29) : తెలుగు సాహిత్యానికి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన సాహితీ యోధుడు డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి అని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు.

కవి, సాహితీవేత్త సింగిరెడ్డి నారాయణ రెడ్డి 92వ జయంతి సందర్భంగా తెలుగు సాహిత్య పరిపుష్టికి ఆయన చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు.

“సినారె” తన పాండిత్య ప్రతిభతో జ్ఞానపీఠ అవార్డును అందుకొని తెలుగు భాష వైభవాన్ని జగద్విదితం చేసారని కొనియాడారు. తెలుగు భాషా సాహిత్యంలో పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, సంగీత నృత్య రూపకాలు, గజళ్ళు ఇలా ప్రతీ ప్రక్రియలో తన పాండిత్యాన్ని నిరూపించుకున్న విలక్షణ కవి సినారె అని సీఎం పేర్కొన్నారు. కవిగా, సాహితీవేత్తగా, పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా, సినీ గేయ రచయితగా, పరిపాలనాదక్షుడిగా ఇలా ప్రతీ రంగంలోనూ రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి సినారె అని సీఎం అన్నారు.

తెలుగు సాహిత్యాన్ని సజీవంగా నిలబెట్టిన అగ్రగణ్య కవుల్లో సినారె ఒకరని సీఎం గుర్తు చేసుకున్నారు. ప్రపంచ భాషల్లోకి అనువాదమైన సినారె రచనలే ఆయన ప్రతిభకు గీటురాయి అని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర అవతరణ తర్వాత ప్రభుత్వం తెలంగాణ కవులు, సాహితీవేత్తలకు తగిన రీతిలో చేయూతనిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నదని సీఎం తెలిపారు.