VRA వ్యవస్థ రద్దు – ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరణ

హైదరాబాద్ (జూలై – 23) : నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు గా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ సిఫారసుల మేరకు, నిబంధనలను అనుసరించి వీఆర్ఏల అర్హతలను ప్రకారం, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రేపు (సోమవారం) నాడు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారిని సీఎం ఆదేశించారు.

సామాజిక పరిణామక్రమంలో మార్పులకనుగుణంగా, ప్రజల అవసరాలను అనుసరించి పాలకులు నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని, కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వ విధానమని, ఈ విధానాన్ని అనుసరించే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నామని సీఎం వివరించారు.

రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం శ్రీ కేసీఆర్ ఈరోజు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం వ్యవసాయం అభివృద్ధి చెంది సాగునీటి విధానం అమల్లోకి వచ్చిన నాటి కాలంలో ప్రతి గ్రామంలో నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంతో పాటు గ్రామ రెవిన్యూ తదితర అవసరాలకోసం ఏర్పాటయిన గ్రామ సహాయకుల వ్యవస్థ నేటి వీఆర్ఏలుగా రూపాంతరం చెందిందని సీఎం అన్నారు. అట్లా తర తరాలుగా సామాజిక సేవ చేస్తున్న వీఆర్ఏల త్యాగపూరిత సేవ గొప్పదని సీఎం కొనియాడారు. కాగా నేటి మారిన పరిస్థితుల్లో వీఆర్ఏల వృత్తికి ప్రాధన్యత తగ్గిన నేపథ్యంలో, వారికి రెవిన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పించి, పర్మినెంట్ చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

తరతరాలుగా సమాజానికి సేవ చేస్తున్న గ్రామ సహాయకులకు (వీఆర్ఏలు) రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయం వారి వ్యక్తిగతంగా మాత్రమే కాదని, ఇది సమాజానికి చేస్తున్న సేవగా భావిస్తున్నామని సీఎం తెలిపారు.

అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలతో, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వారి కోసం తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం పునరుద్ఘాటించారు. ఇప్పటికే ఎవరూ అడగకుండానే సమాజానికి సేవలు చేస్తున్న ఉద్యోగ వర్గాలకు జీతాలు పెంచి వారి సంక్షేమానికి పాటుపడిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ‘సఫాయన్నా నీకు సలామన్నా’ అంటూ ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని సీఎం చెప్పారు.

కాగా మస్కూరు తదితర పేర్లతో తమను తరతరాలుగా వెంటాడుతున్న సామాజిక వివక్షతో కూడిన విధుల నుంచి తమకు విముక్తి కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేసి, తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మీకెంతో రుణపడి ఉంటామని వీఆర్ఏ జేఏసీ నేతలు సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

వీఆర్ఏల క్రమబద్ధీకరణ సర్దుబాటు విధానం:

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏ లు పనిచేస్తున్నారు. వీరిలో నిరక్షరాస్యులు, ఏడవ తరగతి పాసైనవారు, పదవ తరగతి పాసైనవారు, ఇంటర్మీడియేట్ వరకు మాత్రమే చదివి పాసైనవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారు. వీరి విద్యార్హతను బట్టి ప్రభుత్వం ఉద్యోగ కేటగిరీలను నిర్ధారిస్తుంది. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో వారి భర్తీ చేస్తాం’’ అని సీఎం తెలిపారు.

ఉన్నత చదువులు చదివి ప్రమోషన్లకు అర్హులైన వారికి అందుకనుగుణమైన పోస్టుల్లో భర్తీ చేయనున్నట్టు సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టి, విధివిధానాలు ఖరారు చేసి, రేపు (సోమవారం) ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు సీఎం నిర్ణయించారు. అదేవిధంగా 2 జూన్ 2014 అనంతరం 61 ఏండ్ల లోపు ఉండి ఏ కారణం చేతనైనా వీఆర్ఏ విధులు నిర్వహిస్తూ మరణించిన వీఆర్ఎ వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం అన్నారు. కాగా… చనిపోయిన వీఆర్ఏ ల వారసుల వివరాలు, వారి విద్యార్హతలు త్వరలో సేకరించాలని అధికారులను వీఆర్ఏ జేఏసీ నేతలకు తెలిపారు. వీరికి కూడా నిబంధనలకు అనుసరించి అర్హతల మేరకు, ఆయా శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్దుబాటు చేయాలన్నారు.