JEE ADVANCED : ఇక తెలుగులోనూ జేఈఈ అడ్వాన్స్డ్

హైదరాబాద్ (జూన్ – 27) : నీట్, జేఈఈ మెయిన్ పరీక్షల వలె జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షనూ తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఐఐటీలు, ఎన్ఐటీలు మినహా.. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో ఒకే పరీక్ష నిర్వహణ సాధ్యాసాధ్యాలపై 5 నెలల్లో నివేదిక ఇచ్చే బాధ్యతను ఐఐటీ ఢిల్లీకి అప్పగించింది.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన ఐఐటీ కౌన్సిల్ సమావేశం ఏప్రిల్ 18న భువనేశ్వర్లో జరిగిన విషయం తెలిసిందే. ఆ సమావేశం తీర్మానాలను తాజాగా కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.

★ ముఖ్యాంశాలు

2024-25 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో క్రీడా కోటా అమలుకు విధివిధానాల రూపకల్పన బాధ్య తలను ఐఐటీ మద్రాస్ కు అప్పగించారు.

ఐఐటీల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెరిట్ కమ్ మీన్స్ (ఎంసీఎం) స్కాలర్షిప్, పాకెట్ అలవెన్స్ ను పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీనిపై ఐఐటీ ఖరగ్ పూర్ నివేదిక సమర్పించనుంది.

పరిశ్రమల అవసరాల మేరకు ఎంటెక్ కోర్సులను రూపొందించాలని నిర్ణయించారు. దీనిపై ఐఐటీ హైదరాబాద్ నివేదిక సమర్పించనుంది.

ఆర్ట్స్, ఇతర కోర్సుల్లో మల్టీ డిసిప్లినరీ విధానాన్ని ప్రారంభిస్తారు. ఆయా కోర్సుల్లో ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్ సబ్జెక్టులు మిళితమై ఉంటాయి.

ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ (PMRF) ను అయిదేళ్లపాటు కొనసాగిస్తారు. ఏడాదికి వెయ్యి మంది చొప్పున అయిదేళ్లలో 5 వేల మంది పీహెచ్డీ విద్యార్థులకు ఈ ఫెలోషిప్ అందజేస్తారు.

ఖరగ్ పూర్, మద్రాస్, గువాహటి, భువనేశ్వర్ ఐఐటీల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులు ప్రారంభిస్తారు.

వచ్చే 25 సంవత్సరాలకు ఐఐటీలన్నీ దార్శనిక పత్రాన్ని రూపొందించుకోవాలి. ఇందుకోసం
అంతర్జాతీయ నిపుణులతో కలిపి కమిటీని ఏర్పాటు చేస్తారు. ప్రతి ఐఐటీ స్వల్ప కాల విజన్ డాక్యుమెంట్ ను సైతం సిద్ధం చేసుకోవాలి.

ఐఐటీల్లో డ్రాపౌట్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఐఐటీ ఖరగ్ పూర్ ను ఆదేశించారు.