Hiroshima day : హిరోషిమా దినోత్సవం

BIKKINEWS (ఆగస్టు – 06) : మానవ చరిత్రలో మొట్టమొదటి అణుదాడిన ఎదుర్కొన్న నగరం జపాన్ లోని హిరోషిమా (Hirisima day) … 1945 ఆగష్టు 6 న ‘ఎనొల గే’ అనే విమానం ద్వారా “లిటిల్ బాయ్” అనే పేరు గల అణు బాంబు ను హిరోషిమా నగరం పై వదిలారు. భూమికి 1750 మీటర్ల దూరంలోనే ఇది విస్పోటనం చెందింది.

ఈ విస్ఫోటనంలో 70 – 80 వేల మంది అక్కడికక్కడే మరణించారు. అంటే ఈ సంఖ్య హిరోషిమా పట్టణ జనాభాలో మూడవ వంతు.

మళ్ళీ మూడవ రోజు అంటే 1945 ఆగస్టు 09వ తేదీన అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన నాగసాకిపై “ప్యాట్ బాయ్” పేరు గల మరో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికాకు లొంగిపోక తప్పలేదు.

ఇది ప్రపంచ చరిత్ర లోనే అతి ఖరీదైన యుద్ధంగా మిగిలి పోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించబడ్డాయి. కాని మానవ చరిత్రలో మరిచి పోలేని పీడ కలగా ఈ సంఘటన మిగిలి పోయింది. 1945 ఆఖరికి 2 లక్షల మందికి పైగా యుద్దబాధితులుగా మిగిలారు. వీరిలో చాలామంది జీవించగలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు.

అణు బాంబు దాడికి గురైన తర్వాత హిరోషిమాలో పూసిన తొలి పుష్పం ఓలియెండర్. అందుకే దీన్ని హిరోషిమా నగర అధికారిక పుష్పంగా ప్రకటించారు.

బాంబు పేలిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో పెరుగుతున్న ఆరు గింక్గో చెట్లు అణు విధ్వంసాన్ని తట్టుకొని మనుగడ సాగించాయి. రేడియేషన్ ప్రభావం నుంచి వేగంగా తేరుకొని తిరిగి చిగురించాయి. వీటిని సజీవ శిలాజాలు అంటారు. సిటీలోని ట్రామ్ వ్యవస్థ బాంబు దాడి తర్వాత కూడా పని చేసింది. గాయపడిన వారిని అందులో తరలించారు. వాటిలో కొన్ని నేటికీ పని చేస్తున్నాయి.

2020 నాటికి అణ్వాయుధాలను నిర్మూలించాలనే లక్ష్యంతో పని చేస్తోన్న ‘మేయర్స్ ఫర్ పీస్’ అనే అంతర్జాతీయ సంస్థకు హిరోషిమా మేయర్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. హిరోషిమా మెమోరియల్ పార్క్‌లో 1964లో శాంతి జ్యోతిని వెలిగించారు. అణ్వాయుధాల నిర్మూలన పూర్తయ్యే వరకు ఇది వెలుగుతూనే ఉంటుంది.