అర్హత ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించండి – హైకోర్టు

హైదరాబాద్ (జూన్ – 13) : తెలంగాణ కోర్టుల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆ పోస్టుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉంటే వారిని క్రమబద్ధీకరించాలని రిజిస్ట్రార్ జనరల్ ను హైకోర్టు ఆదేశించింది. కొందరు పది పదిహేనేళ్లుగా పని చేస్తున్నారని, వారి సేవలను పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించింది.

కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వీరితో భర్తీ చేయాలని సూచించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిన పని చేస్తున్న వారిని తొలగిస్తూ 2021, ఏప్రిల్ 1న రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిని సవాల్ చేస్తూ 200 మంది వరకు ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్ నవీన్ రావు, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం సోమవారం విచారణ నిర్వహించింది.