న్యూడిల్లీ (ఆగస్టు – 16) : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఈరోజు పలు నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ముఖ్యమైనవి పిఎం విశ్వకర్మ స్కీం, పీఎం ఈ బస్సు సేవ స్కీం, డిజిటల్ ఇండియా పథకం, ఏడు రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.
◆ PM VISWAKARMA SCHEME:
ఓబిసి సామాజిక వర్గానికి చెందిన కళాకారులు, చేనేత కారులు వడ్రంగులు, రజకులు, క్షవరకారులు, స్వర్ణకారులు వంటి సాంప్రదాయ వృత్తులు కలిగి ఉన్న కుటుంబాలకు మేలు కలిగించేలా పీఎం విశ్వకర్మ స్కీంను సెప్టెంబర్ 17న ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం 13 వేల కోట్ల రూపాయలను కేంద్రం వెచ్చించనుంది.
ఈ పథకం కింద పలు వృత్తి నైపుణ్యాలను పెంపొందించడానికి శిక్షణ కార్యక్రమాలను చేపడతారు. శిక్షణ కాలంలో రోజుకి 500 రూపాయల ఉపకార వేతనాన్ని చెల్లిస్తారు శిక్షణ అయిపోయాక 15 వేల రూపాయలతో సామాగ్రి కొనిస్తారు. లక్ష రూపాయల వరకు రుణ సహాయం చేస్తారు. రెండో దశలో రెండు లక్షలు రూపాయల వరకు రుణ సహాయం ఐదు శాతం వడ్డీకి చెల్లించనున్నారు.
◆ GREEN MOBILITY SCHEME
57,163 కోట్ల వ్యయంతో పట్టణ ప్రాంతాలలో పిఎం ఈ బస్ సేవ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 10,000 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనుంది
◆ DIGITAL INDIA SCHEME
డిజిటల్ ఇండియా పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 14,903 కోట్లను కేటాయించారు. ఈ పథకం ద్వారా 5.25 లక్షల మంది ఐటి ఉద్యోగుల నైపుణ్యాలను పెంపుదలకు చర్యలు చేపట్టనున్నారు.అలాగే 9 సూపర్ కంప్యూటర్లను అభివృద్ధి చేయనున్నారు.
◆ 7 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు అమోదం
32,500 కోట్ల అంచనాతో దేశంలోని రైల్వే రద్దీని తగ్గించడం, రైల్వేలను క్రమబద్ధరించటం కోసం ఏడు మల్టీ రైల్వే ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్ రాష్ట్రాలలో రైల్వే ట్రాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు.