Rashtriya Vigyan Puraskar : జాతీయ విజ్ఞాన పురష్కారాలు

హైదరాబాద్ (సెప్టెంబర్ 22) : భారత ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇప్పటివరకు విభిన్న సంస్థలు, విభిన్న ప్రభుత్వ శాఖలు అందిస్తున్న 300 రకాల పురస్కారాలను రద్దు చేస్తూ వాటి స్థానంలో రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాల (Rashtriya Vigyan Puraskar) పేరిట నాలుగు రకాల అవార్డులను ప్రధానం చేయడానికి నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు నేతృత్వం లోని కమిటీ 13 విభాగాల్లో శాస్త్రవేత్తలను వీటికి ఎంపిక చేస్తుంది.

రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం కింద ధ్రువీకరణ పత్రంతో పాటు పతకాన్ని అందజేస్తారు. ఇవి శాస్త్ర సాంకేతిక రంగాలలో చేసిన కృషికి అత్యున్నత గుర్తింపుగా నిలుస్తాయి.

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే భారతీయ, ప్రవాస భారతీయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తలతో పాటు సొంతంగా పనిచేసుకునేవారూ ఈ పురస్కారాలకు అర్హులే.

శాస్త్ర, సాంకేతిక, నవకల్పనల రంగంలో విశిష్ట సేవలు అందించే వారిని గౌరవించేందుకు ‘రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్’ పేరిట కొత్త జాతీయ అవార్డులను ఆవిష్కరించింది. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాల్లో నాలుగు రకాలు ఉంటాయి. అవి..

1) విజ్ఞాన్ రత్న అవార్డు
2) విజ్ఞాన్ శ్రీ అవార్డు
3) విజ్ఞాన్ యువ- శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు
4) విజ్ఞాన్ బృందం అవార్డు

1) విజ్ఞాన్ రత్న :

ఇది జీవన సాఫల్య పురస్కారం. శాస్త్ర సాంకేతిక రంగంలోని ఏ విభాగం లోనైనా మహోన్నత సేవలు అందించినవారికి ప్రదానం చేయనున్నారు.

2) విజ్ఞాన్ శ్రీ :

శాస్త్ర సాంకేతిక రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇస్తారు.

3) విజ్ఞాన్ యువ – శాంతిస్వరూప్ భట్నాగర్:

శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి 1958 నుంచి ఏడు విభాగాల్లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులను అందిస్తోంది. వాటిలో ప్రస్తుతం మార్పులు చేశారు. శాస్త్ర సాంకేతిక రంగంలో గొప్ప సేవలందించే యువ శాస్త్రవేత్తలకు (45 ఏళ్ల వయసు వరకు ఉన్నవారు) 13 విభాగాల్లో విజ్ఞాన్ యువ పురస్కారాలు అందిస్తారు.

4) విజ్ఞాన్ బృందం :

సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఏ విభాగంలోనైనా విశిష్ట కృషి చేసే బృందాలకు ప్రదానం చేస్తారు. బృందంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఆవిష్కర్తలు ఉండాలి.