కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితిపై జేఏసీ చైర్మన్ కనకచంద్రం ఇంటర్వ్యూ

BIKKI NEWS : ఇంటర్విద్యాలో ప్రచారం లేకుండా తన పని తీరుతోనే మాట్లాడే వ్యక్తి కాదు కాదు శక్తి ఆయన. ఆయన పిలుపిస్తే రాష్ట్రం నలుమూలలా నుండి రాష్ట్రంలో ఏ మూల సభ పెట్టిన సైన్యం లా కదిలి వచ్చే అనుచరులు ఆయన సొంతం. మంత్రి హరీష్ రావుకు సొంత మనిషిగా, ఇంటర్విధ్యా జేఏసీ చైర్మైన్ పి. మధుసూదన్ రెడ్డికి శిష్యుడిగా ఆయన ప్రస్థానం అనితర సాధ్యం. అయనే ఉన్నత విద్యా జేఏసీ చైర్మన్ సీహెచ్. కనకచంద్రం… ఉన్నత విద్యా లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల ప్రస్తుత పరిస్థితుల పై అలాగే భావి ప్రణాళికలను BIKKI NEWS తో పంచుకున్నారు. ఆ వివరాలు

◆ కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ అనే అంశం సాధ్యమవుతుందా.?

కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ అనేది సీఎం కేసీఆర్ స్వప్నం. 2010 డిసెంబర్ లో టీఆరెస్ పోలిట్ బ్యురో సమావేశంలోనే కాంట్రాక్టు లెక్చరర్ ల క్రమబద్దీకరణ కోసం మొదటిగా తీర్మానం చేయడం జరుగింది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గా కేసీఆర్ నిర్వహించిన మొదటి కేబినెట్ భేటీలో నే జీవో నెంబర్ 16 విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దానికనుగుణంగా క్రమబద్ధీకరణ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది కోర్టుకు వెళ్లడం ఆ ప్రక్రియ కోర్ట్ స్టే ఇవ్వడం జరిగింది.

కానీ 100% “కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు కట్టుబడి ఉన్న కేసీఆర్ ప్రభుత్వం జీవో నెంబర్ 16 పై హైకోర్టులో ఉన్న కేసు మీద ఆర్థిక శాఖ నోట్ పైల్ పంపడం జరిగింది. ప్రభుత్వం అనుకూలంగా ఉండటం మరియు తాజాగా “ఉమాదేవి కేసు” అనేది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అడ్డంకి కాదు అని మన గౌరవ హైకోర్టు కొన్ని కేసులలో తీర్పు ఇవ్వడం జరుగింది కావునా తీర్పు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నా.

◆ కేసు ఏమైనా అటుఇటు అయితే ఉద్యోగ భద్రతను ప్రభుత్వం ఇస్తుందా.?

ఉద్యోగ భద్రతా అనేది తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన రోజే కాంట్రాక్టు అధ్యాపకులకు ఏర్పడింది. ఒక రోజు విరామం లేకుండా గత మూడేళ్ల నుంచి మేము సర్వీస్ లో కొనసాగుతున్నాం. అలాగే నాన్ టీచింగ్ సిబ్బంది 10% ప్రమోషన్ లలో కూడా మా పోస్టులను ఖాళీగా చూపకుండా ఖాళీగా ఉన్న స్థానలలోకి వారికి ప్రమోషన్ ఇస్తున్నారు. అలాగే ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా మేము పని చేసే పోస్టులను ఖాళీగా చూపకుండా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను ప్రకటించారు. కావునా మాకు రిటైర్మెంట్ వరకు ఉద్యోగ భద్రత కల్పించిందని చెప్పవచ్చు.

◆ రెన్యువల్ జీవో ఆలస్యానికి కారణం ఏమిటి.?

నూతన 7 జోన్లు ప్రకారం కళాశాల యూనిట్ గా ఆర్థిక శాఖ పంపిన ప్రొపార్మాలో వివరాలతో నివేదిక పంపాలని ఆర్థిక శాఖ ఇంటర్మీడియట్ కమీషనర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు ఆదివారం అయినా కూడా జిల్లా ఇంటర్విధ్యా అధికారులకు కమీషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. సంబంధించిన ప్రొపార్మాలో కాంట్రాక్టు అధ్యాపకుల వివరాలు పంపిన వెంటనే రెన్యూవల్ జీవో విడుదల అవుతుంది.

◆ కాంట్రాక్టు అధ్యాపకుల రెన్యువల్ పైల్ లో గెస్ట్ అధ్యాపకుల ప్రస్తావన రావడానికి కారణం ఏమిటి.?

గెస్ట్ అధ్యాపకుల రెన్యువల్ విషయం కాకుండా కేవలం ఈ పోస్టులు ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నాయని, కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల రెన్యూవల్ తో పాటు ఈ ఖాళీగా ఉన్న 1658 పోస్టులను విద్యార్థులకు నష్టం జరగకుండా భౌతిక తరగతులు ప్రారంభం కాగానే నియామాకాల జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని మాత్రమే ఫైల్ లో ఇంటర్ విద్యాశాఖ ఆర్థిక శాఖను అభ్యర్థించడం జరిగింది.

◆ బర్నింగ్ టాపిక్ బదిలీల మీద మీ స్పందన.

బదిలీలు లేక కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులు తీవ్ర ఆందోళనలో ఉన్న విషయం తెలిసిందే. దీనిని చాలెంజ్ గా తీసుకుని పని వస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ ఒక రోజు అటోఇటో బదిలీలు సాధించి తీరుతాను. “కేసిఆర్ కు కృతజ్ఞత సభ” లో కూడా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లిన ఒకే ఒక అంశం బదిలీలు. ఈ విషయం తెలిసిన పూర్తి చిత్తశుద్ధి తో పని చేస్తున్నా.

బదిలీల విషయంలో ఇప్పటికే GJLA అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బలరాం నాయక్ మరియు ప్రిన్సిపాల్ సంఘం అధ్యక్షుడు కె.ఎస్. రామారావు, ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్ ల సహకారం కోరగా పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరిగింది.

ఇంకా రెన్యూవల్ ఉత్తర్వులు రాకపోవడం, సంఖ్యాపరంగా, సర్వీస్ పరంగా, కొత్త జోనల్ ప్రకారంగా కొన్ని టెక్నికల్ అంశాలు అధికారుల లేవనేత్తారు. దానివలన బదిలీల ప్రక్రియ కొంత ఆలస్యంగా అయినా జరిగే అవకాశం ఉంది. మంత్రి హరీష్ రావు సహకారంతో బదిలీలను 100% జరిపించే బాధ్యత నాదే.

◆ సంస్కృతం రెండవ భాషగా ప్రభుత్వం ప్రవేశ పెట్టడం పై మీ అభిప్రాయం.?

సంస్కృతం అనేది ఇంటర్మీడియట్ రెండవ భాషగా ఇప్పటికే ఉన్నది. కాకపోతే ఎక్కువగా ప్రైవేట్ కళాశాలలో రెండవ భాషగా కొనసాగుతుండగా… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా సంస్కృతం రెండవ భాషగా నడుస్తుంది. దీనివలన తెలుగు, హిందీ సబ్జెక్టుల ప్రభావం పడుతుంది అనేది సంబంధించిన లెక్చరర్ లలో ఉన్న అపోహ ఉంది.

ఇది కేవలం కొంత వరకు సిటీలలో ఉండవచ్చు కానీ మండల స్థాయిలో సంస్కృతం అంతగా ప్రభావం చూపదని నా అభిప్రాయం. మరియు సంస్కృతం పరీక్షను దేవనాగరి లిపిలో రాయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ తెలుగు, ఇంగ్లీషు భాషలలో సంస్కృతం పరీక్ష రాస్తున్న కూడా పూర్తి మార్కులు ఇవ్వడం పట్ల ఇంటర్మీడియట్ బోర్డు తగు చర్యలు తీసుకోవాలి.

◆ ఎమ్మెల్సీ ఎన్నికల హమీ నెలనెలా వేతనాలు ఎప్పటినుండి అమలు అవుతాయి.?

మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నెలనెల వేతనాలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. అలాగే అనేక సందర్భాల్లో సీఎం కేసీఆర్ కూడా ఆర్థిక శాఖ అధికారులతో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు దృష్టికి వచ్చింది. అయితే మనకు మూడు నెలలకు సరిపడా వేతనం ఆర్థిక శాఖ నుంచి ముందుగానే విడుదల అవుతున్నప్పటికి డీడీవోలుగా జిల్లా ఇంటర్ విద్యా అధికారులు ఉన్నంత కాలం ఈ నెలనెల వేతనం అనేది సాధ్యపడకపోవచ్చు. అందుకే కళాశాల ప్రిన్సిపాల్ లనే డీడీవోలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అప్పుడే నెలనెల వేతనాలు సాద్యమవుతాయని ఇప్పటికే పలుమార్లు ఇంటర్ విద్యా అధికారులకు మరియు ఆర్థిక శాఖ అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఇది సాదించి తీరుతాం.

◆ తాజాగా పి.ఆర్.సి. రిపోర్ట్ లో కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సెలవులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ ఫలితం ఎప్పుడు దక్కుతుంది.?

తెలంగాణ తొలి పీఆర్సీ నివేదికలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా అన్ని రకాల సెలవులు ఇవ్వాలని పేర్కొన్న విషయం వాస్తవం. ఇది ఖచ్చితంగా సాధించుకోవాల్సిన హక్కు. దీనికొరకు నేను కచ్చితంగా పోరాడి త్వరలోనే సాధిస్తా.

◆ క్రమబద్ధీకరణకు ఉన్న అడ్డంకులు ఏమిటి.?

క్రమబద్ధీకరణకు ఎలాంటి అడ్డంకులు లేవు. ప్రస్తుతం జీవో నంబర్ 16 పైన ఉన్న కేసు వెకేట్ చేస్తే వెంటనే క్రమబద్ధీకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 319 మంది వొకేషనల్ కాంట్రాక్టు అధ్యాపకులు నాన్ శాంక్షన్ పోస్టులలో పని చేస్తున్నారు. వీరి పోస్టుల శాంక్షన్ కు కృషి చేస్తున్నాను.

◆ కాంట్రాక్టు ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పై మీ అభిప్రాయం.?

త్వరలోనే రిటైర్మెంట్ వయస్సు 61 ఏళ్ళు మాకు కూడా వర్తించేలా ఉత్తర్వులు తీసుకురావడానికి కృషి చేస్తున్నాను. ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే రిటైర్మెంట్ వయసు 58నుంచి 61కి పెంచడం జరిగింది. కానీ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కావున ఈ ఉత్తర్వులు తీసుకురావడానికి కృషి చేస్తున్నాను.

◆ HEC గ్రూప్ భవిష్యత్ ఏమిటి.?

చరిత్ర మనకు అనేక పాఠాలు నేర్పుతుంది. కావునా ఇంటర్మీడియట్ స్థాయిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలో మరియు డిగ్రీ కళాశాల లో HEC గ్రూప్ ని కంపల్సరీ గ్రూపుగా ప్రవేశ పెట్టాలి. అలాగే హిస్టరీ – పొలిటికల్ సైన్స్ బోధనకు వేర్వేరుగా అధ్యాపకులను నియమించుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి.

◆ ఉన్నత విద్య జేఏసీ చైర్మన్ గా ఎంపిక కావడం పట్ల మీ అభిప్రాయం.?

ఉన్నత విద్యా జేఏసీ చైర్మన్ గా నన్ను ఎంపిక చేయడం లో కీలకంగా వ్యవహరించిన పాలిటెక్నిక్, డిగ్రీ అధ్యాపక సంఘ నాయకులు ఉమా మహేశ్వర్, వినోద్ కుమార్ లకు కృతజ్ఞతలు.

విభజించు పాలించు అనే సూత్రం పాటిస్తూ కాంట్రాక్టు అధ్యాపకులకు దక్కాల్సిన హక్కులను, ఫలితాలను రాకుండా చేస్తున్నారు. అందుకే సంఖ్యా బలం పెంచుకుంటూ హక్కుల సాదనలో సమిష్టి గా పాల్గొనాలని ఉన్నత విద్యా జేఏసీ గా ఏర్పడటం జరిగింది. ఒకే ఆలోచన విధానం ఉన్న సంఘాలతో ఈ జేఏసీ ‌ఏర్పడింది. భిన్నాభిప్రాయాలు ఉన్న సంఘాలతో జేఏసీ ఏర్పాటు చేసిన అది ఎక్కువ కాలం కొనసాగదు అని నా అభిప్రాయం.

◆ ఉన్నత విద్య జేఏసీ చైర్మన్ గా మీ సందేశం.?

ప్రస్తుతం కరోనా పరిస్థితులలో రాష్ట్రంలో ఆన్లైన్ తరగతులు నడుస్తున్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం మనల్ని సర్వీస్ లో కోనసాగిస్తూ, పిఆర్సీని వెంటనే అమలు చేసి మమ్మల్ని తమ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. కావున ఇలాంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి… ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చీదిద్దడమే ప్రథమ కర్తవ్యం గా పని చేస్తున్నాం. అలాగే భారీగా అడ్మిషన్లు చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాపాడుకోవాలి. ప్రస్తుతం ఆన్లైన్ తరగతులు విద్యార్థులు కచ్చితంగా వినేలా పూర్తి స్థాయిలో పని చేయాలి.