BIODIVERSITY DAY : జీవవైవిధ్య దినోత్సవం

BIKKI NEWS (మే – 22) : అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంను (Biodiversity Day) మే 22న జరుపుకుంటారు. 2010ని అంతర్జాతీయ జీవవైవిధ్య సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2024 (biodiversity day 2024 theme)యొక్క థీమ్ ‘BE PART OF THE PLAN’

అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2023 యొక్క థీమ్ “ ఒప్పందం నుండి చర్య వరకు: జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడం.”

భూమిపై జీవాల మధ్య వైవిధ్యతనే ‘జీవవైవిధ్యం’ అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల జీవ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్‌ సంవత్సరాల పరిణామ క్రమంలో ఏర్పడింది. మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి.

ప్రపంచంలోని 12 మహా జీవవైవిధ్య ప్రాంతాలలో భారత దేశం ఒకటి. సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతు జాతులు ఈ దేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10 శాతానికిపైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటి వనరులు కనుమరుగయ్యె పరిస్థితులు ఉన్నాయి.. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్ళను మన జీవనశైలితో రూపుమాపేశాము. సముద్రతీరాలను అతలాకుతలం చేసేశాము. ఇవన్నీ చాలవన్నట్టు అరణ్యాలలోని వన్యప్రాణుల్ని వేటాడి కొందరు అంతమొందిస్తున్నారు.

వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటక నాశనులకు ప్రాధాన్యత పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా, విచక్షణారహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవసంపదను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు, అత్యధిక కీటక నాశనులను ఉత్పత్తి చేసే దేశంగా భారత్ విరాజిల్లుతోంది. ఇటువంటి అవాంఛనీయ చర్యల వల్ల దారుణంగా నష్టపోయాం. అంతేకాదు అపార జీవజాతులు అంతరించిపోయాయి.

విశేషమేమిటంటే.. మన దేశంలో ఆదివాసులు (గిరిజనులు, కొండజాతి ప్రజలు) ఎక్కడున్నారో అక్కడ జీవవైవిధ్యం ఎక్కువగాను, పదిలంగానూ ఉంది. మన దేశంలో 53 మిలియన్ల కంటే ఎక్కువమందే ఆదివాసులు నివసిస్తున్నారంట. వారిలో దాదాపు 53 తెగలున్నాయి. మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 80 శాతానికంటే ఎక్కువమంది గిరిజనులు ఉన్నారు. అక్కడే జన్యు వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది. ఎన్నో పంటలలో వైవిధ్యాలు, రకాలు, ఆదివాసులు నివాసాలున్న ప్రాంతాలలోనే అధికం. ఇటీవల జన్యుమార్పిడి కూడా జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది. వీటిని రూపొందించే, ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ సంబంధమైన నియంత్రణలను పాటించాలి. జన్యుమార్పిడివల్ల వచ్చే ప్రభావాలు స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో పూర్తి అధ్య యనం చేయకుండా వీటిని ఏ జీవజాతుల్లోనూ ప్రవేశ పెట్టకూడదు. తొందరపడితే ప్రస్తుతం మనుగడలోని జీవజాతికే ప్రమాదం వాటిల్లు తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ సృష్టిలో అన్నిటిలో ఏకత్వం ఎంత ఉందో, భౌతికంగా, మానసికంగా భిన్నత్వం కూడా అంతే ఉంది. వైవిధ్యమే సృష్టి లక్షణం అంటారు స్వామి వివేకానంద. సృష్టిలో గల జీవరాశులలో ఏ ఒక్కటి అధికంగా కాదు, ఏదీ తక్కువ కాదు. అన్ని సమానమే. అన్ని ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. మనిషి తన ప్రతి అవసరానికి ప్రకృతి మీద ఆధారపడ్డాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ఇది గమనించిన భారతీయ ఋషులు జీవ వైవిధ్య చక్రం సక్రమంగా సాగేలా, ఎక్కడ మనిషి వాటిలో కల్పించుకునే వీలు లేకుండా మానవ ధర్మాలను చెప్పారు. వ్యవసాయ పద్ధతులే కావచ్చు, జీవన విధానమే కావచ్చు, ఆహారపు అలవాట్లే కావచ్చు, అన్ని సృష్టి చక్రానికి లోబడే ఉంటాయి.

చెరువులో ఉండే కీటకాలను తిని కప్ప జీవిస్తుంది. కప్పను తిని పాము జీవిస్తుంది, పామును గద్ద తింటుంది, గద్ద మరణించాక దాన్ని క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టు విధానం, ఒక వృత్తం. వీటిలో ఏ ఒక్క ప్రాణి అంతరించినా మిగితా అన్నిటి మీద ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం ఉంటుంది, మిగతా ప్రాణుల మీద పరోక్షంగా ముప్పు ఉంటుంది. ఇలా జగత్తులో అనేక వృత్తాలు ఉంటాయి. వాటిలో మనిషి ఏ మాత్రం జోక్యం చేసుకున్నా అది వినాశనానికి దారి తీస్తుంది, ఏ ఒక్క జీవి అంతరించినా, మానవ మనుగడ ప్రశ్నార్ధకమవుతుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 10,000 జాతుల జీవరాశులు అంతరించి పోతున్నాయి.

భారతీయ సంస్కృతిలో ప్రతి చిన్న ఆచారం ప్రకృతిహితంగానే ఉంటుది. వ్యవసాయంలో ఏ విధమైన హైబ్రిడ్, బీటీ విత్తనాలు ఉండవు. రైతు సొంతంగా విత్తనాలు తయారు చేసుకుంటాడు. భూమి మనకు అమ్మ వంటిది అని భావించి విషపు రసాయన ఎరువులతో నింపడు. కేవలం ఆవు పేడ, మూత్రాన్ని మాత్రమే ఉపయోగించి తాను సొంతంగా తయారు చేసుకున్న ఎరువునే వాడుతాడు. వ్యవసాయంలో ప్రకృతి సాయం తీసుకుంటాడు. అందుకే 3-4 రోజులు నీళ్ళు పెట్టకపోయినా, మొక్క వాడిపోదు. ఆఖరున దిగుబడి అధికంగా వస్తుంది, వచ్చినదాంట్లో కొంచెం పిచ్చుకల కోసం సింహద్వారానికి ప్రత్యేకంగా కట్టి ఆహ్వానిస్తాడు. రసాయనాలు వాడని కారణంగా పొలంలో రకరకాల మిత్రజీవాలు కనిపిస్తాయి. వైవిధ్యం వెల్లివిరుస్తుంది. రైతుకు పెట్టుబడి పెట్టకుండా లాభం వస్తుంది. ఇది ప్రకృతి వ్యవసాయం. జీవవైవిధ్యాన్ని రక్షించే అచ్చమైన, స్వచ్ఛమైన భారతీయ వ్యవసాయపద్ధతి. ఈ విధానంలో పూసిన పూలు రెండు నుంచి మూడు రోజుల వరకు ప్రిజ్‌లో పెట్టకపోయిన వాడిపోవు, భూమి కొన్ని ఏళ్ళ తర్వాత ఏ విధమైన ఎరువు వేయకున్నా బంగారం పండిస్తుంది.

రసాయనిక ఎరువులను వాడి, భూమిని, జీవాలను చంపి, ఆఖరికి రైతే ఆత్మహత్య చేసుకునేందుకు దోహదపడే దిక్కుమాలిన పద్ధతిని ప్రవేశపెట్టారు. రసాయాలు, బీటీ, హైబ్రిడ్ విత్తనాలు, అన్నీ కలిసి దేశాన్ని రోగిష్టి దేశంగా మార్చేస్తున్నాయి. అనేక జీవజాతుల ప్రాణాలు తీస్తున్నాయి. తరతరాలుగా సొంతంగా మంచి దిగుబడినిచ్చే సహజవిత్తనాలను గిరిజనులు ఇప్పటికి రక్షించుకుంటూ వస్తున్నారు, ఏడాదికొకసారి జాతర ఏర్పాటు చేసుకుని విత్తన మార్పిడి చేసుకుంటున్నారు. కానీ లాభాలే ధేయ్యంగా పనిచేస్తున్న విదేశీ కంపెనీలు సర్వాన్ని నాశానం చేస్తున్నాయి. ఇది భస్మాసుర హస్తమై మొత్తం మానవజాతిని చంపేస్తుంది. ఇది కేవలం వ్యవసాయ రంగంలో జరుగుతున్న దారుణం మాత్రమే. మిగితా అనేక రంగాల్లో కూడా ఇదే తరహాలో జీవవైవిధ్య నిర్మూలన జరుగుతోంది.

మన జీవనశైలిని మార్చుకోవాలి. రసాయన కాలుష్యాన్ని అరికట్టి భూతాపాన్ని తగ్గించాలి. జంతువుల్ని, మొక్కల్ని పరిరక్షించుకోవాలి. చాలా మంది జంతువుల చర్మాలతో చేసే వస్తువుల్ని వాడుతుంటారు. దీన్ని మానుకోవాలి. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.

WIKIPEDIA సౌజన్యం