అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సందేశం.

హైదరాబాద్ (సెప్టెంబర్ – 11) : అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేము. అందుకే తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు దశాబ్ది తెలంగాణలో ఆ సంకల్పం ఫలితాలు చూస్తున్నాం.

అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు కోసం ప్రభుత్వం సంకల్పించిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి అన్ని వర్గాల మద్దతు లభించటంతో ఇవాళ మనం అద్భుతమైన ఫలితాలను చూస్తున్నాం. హైదరాబాద్ లాంటి కాంక్రీట్ కీకారణ్యంలో కూడా ఊహించనంత పచ్చదనం పెరగడంతో అంతర్జాతీయ ఉద్యానవన ఉత్పత్తిదారుల సంఘం అందించే ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ – 2022’ హైదరాబాద్ కు దక్కింది.

అభివృద్ధి ఎంత సాధించినా, సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా ప్రకృతి పరిరక్షణ మన ప్రాథమిక ధ్యేయం. పర్యావరణ పరంగా తగిన రక్షణ చర్యలు చేపట్టని ఫలితమే గ్లోబల్ వార్మింగ్ రూపంలో చూస్తున్నాం. అందుకే మనతో పాటు, భవిష్యత్ తరాలు కూడా ఈ పుడమిపై జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

ఈ దిశగా అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. ‘హరిత తెలంగాణ’ కోసం మన లక్షిత పచ్చదనం 33 శాతం సాధించేదాకా కలిసికట్టుగా పనిచేద్దాం.

ఇదే సమయంలో అటవీ రక్షణ కోసం కార్యదీక్షతో పనిచేసిన అధికారులు, సిబ్బంది 22 మంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం, అడవుల రక్షణ కోసం ఆత్మార్పణం చేసిన అమరులకు నా హృదయపూర్వక శ్రద్ధాంజలి. వీరి ఆశయాలు సజీవంగా ఉండాలంటే ప్రభుత్వం అమలు చేస్తున్న జంగల్ బచావో – జంగల్ బడావో నినాదాన్ని చిత్తశుద్ధితో మనం అమలు చేయాలి. సమాజంలోని ప్రతీ ఒక్కరూ ఆదిశగా ప్రతిజ్ఞ తీసుకోవాలి.