డీఎస్సీ-98 అభ్యర్థులకు 4,072 మందికి కాంట్రాక్టు ఉద్యోగాలు

విజయవాడ (ఎప్రిల్ – 07) : డీఎస్సీ-98లో అర్హత సాధించిన 4,072 మందికి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒప్పంద నిబంధనల ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించాలని ఆదేశాలు (contract jobs for dsc 1998 candidates) పేర్కొంది. కొన్ని ఉమ్మడి జిల్లాల్లో అభ్యర్థులు ఉన్నప్పటికీ పోస్టులు లేనందున ఖాళీలను సర్దుబాటు చేశారు. జిల్లాల్లో అదనంగా ఉన్న ఎస్జీటీ పోస్టులను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు.

అప్పటి విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 2,524 పోస్టులు అదనంగా ఉండగా.. వీటిల్లో 1,381 సీట్లను శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలుకు బదిలీ చేశారు. ఒప్పంద నిబంధన ప్రకారం 60 ఏళ్లలోపు వారికి మాత్రమే పోస్టింగులు ఇవ్వాలని సూచించింది. బీఈడీ అర్హతతో నియామకాలు పొందిన అభ్యర్థులు ఏడాదిలోపు ఆరు నెలల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలనే నిబంధన విధించింది.