NEET UG 2024 – రద్దు చేయకపోవడానికి కారణం అదే – విద్యాశాఖ మంత్రి

BIKKI NEWS (JUNE 23) : NEET UG 2024 EXAM NOT CANCELLED.‘ నీట్‌- యూజీ 2024 ప్రవేశ పరీక్షపై భారీగా అవకతవకలు జరిగినట్లు వార్తలు వస్తున్నా నేపథ్యంలో కూడా పరీక్షను రద్దు చేయకుండా ఉండడానికి గల కారణాలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు.

నీట్‌- యూజీ ప్రవేశ పరీక్ష పేపర్‌ లీకేజ్‌ వల్ల కొందరు విద్యార్థులు లాభపడి ఉన్నప్పటికీ.. పరీక్షను రద్దు చేస్తే ఎంతో కష్టపడి చదివి రాసిన లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు. పాసైన వారి కష్టమంతా వృథా అవుతుందని చెప్పారు. 2004, 2015లో ఈ తరహా ఘటనలే చోటు చేసుకున్నాయని, అయితే లీకేజీ వ్యవహారం భారీ ఎత్తున జరగడంతో అప్పట్లో పరీక్షను రద్దు చేసినట్లు గుర్తు చేశారు. అయితే, ఈసారి లీకేజీ కొన్ని సెంటర్లలో మాత్రమే జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నీట్ యూజీ పరీక్షకు ముందు రోజే పేపర్‌ లీకైందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఏకంగా 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం అనుమానాలను మరింత బలపరుస్తోంది. పేపర్‌ లీకైనట్లు ఓ వైపు కేంద్రం పరోక్షంగా అంగీకరిస్తున్నా.. పరీక్షను రద్దుకు మాత్రం ససేమిరా అంటోంది.

మరోవైపు నీట్‌-యూజీ 2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియను వాయిదా వేసేందుకు సుప్రీం కోర్టు కూడా నిరాకరించింది. జులై 6న నిర్వహించాల్సిన కౌన్సిలింగ్‌ను యథాతథంగా కొనసాగించాలని శుక్రవారం ఆదేశించింది. అంతేకాకుండా పేపర్‌ లీకేజీపై పెనుదుమారం కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణ ప్రక్రియలో సంస్కరణల కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులుండే ఈ కమిటీకి ఇస్రో మాజీ చీఫ్‌ కె.రాధాకృష్ణన్‌ నేతృత్వం వహించనున్నట్లు తెలిపింది.

మరోవైపు నీట్ యూజీ 2024 పరీక్షలను వెంటనే రద్దు చేసి, మరల నిర్వహించాలని దేశవ్యాప్తంగా పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఆ పరీక్షలు మాత్రం వాయిదా & రద్దు

ఇప్పటికీ నీట్ పీజీ 2024 పరీక్షను వాయిదా వేశారు. అలాగే సిఎస్ఐఆర్ నెట్ పరీక్షను కూడా వాయిదా వేశారు. మరోవైపు యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించిన తర్వాత పేపర్ లీక్ అయిందని వార్తలు రావడంతో ఆ పరీక్షను కూడా రద్దు చేశారు. కానీ నీట్ యూజీ 2024 పరీక్ష రద్దు విషయంలో మాత్రం ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తుంది.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు