2028 ఒలింపిక్స్ లో అత్యధిక మెడల్స్ తెలంగాణ నుంచి వచ్చేలా కార్యాచరణ – సీఎం

BIKKI NEWS (AUG. 25) : Hyderabad Marathon 2024. ఒలింపిక్స్ క్రీడల నిర్వహణకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణ అవకాశం ఇండియాకు దక్కితే గనుక హైదరాబాద్‌ను ప్రధాన వేదికగా ఉంచేలా ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా అభ్యర్థించినట్లు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు.

Hyderabad Marathon 2024

హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ ముగింపు వేడుకలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి మారథాన్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. హైదరాబాద్ మారథాన్ నిర్వాహకులను, స్పాన్సర్లను ఈ సందర్బంగా సీఎం అభినందించారు.

రాబోయే ఖేలో ఇండియా యువ క్రీడల నిర్వహణకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రిగారిని కలిసి కోరిన విషయాన్ని వివరించారు. దేశంలో ఏ క్రీడలు జరిగినా తెలంగాణలో హైదరాబాద్‌ కేంద్రంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

అంతర్జాతీయ ఖ్యాతి గడించాల్సిన సందర్భాల్లో గత ప్రభుత్వాల ఫోకస్‌ తప్పడం వల్లే ఈ దేశానికే క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్‌ నగరం ఆ ప్రాధాన్యత నుంచి పక్కకు జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్రీడలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

2028 ఒలంపిక్స్‌లో తెలంగాణ నుంచి అత్యధిక మెడల్స్ సాధించాలన్న లక్ష్యంతో కార్యాచరణ ప్రారంభించామని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే ఏడాది నుంచే ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీకి దక్షిణ కొరియా స్పోర్ట్స్ వర్సిటీ సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లోని స్టేడియాలను ఒలింపిక్స్ స్థాయికి అప్ గ్రేడ్ చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్రీడాప్రాంగణాల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు