BIKKI NEWS (SEP. 02) : Exgratia increased for flud effected people in tg. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
Exgratia increased for flud effected people in tg
భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు అందించే ఎక్స్ గ్రేషియాను రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే బాధిత కుటుంబాలకు ఆ సాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
చనిపోయిన పాడి గేదెలు ఒక్కో దానికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 30 వేల నుంచి రూ. 50 వేలకు పెంచాలని, మరణించిన మేకలు, గొర్రెలకు ఒక్కోదానికి ఇచ్చే రూ. 3 వేల సాయం రూ.5 వేలకు పెంచాలని సీఎం ఆదేశించారు. తక్షణం బాధిత కుటుంబాలకు అందించాలని సూచించారు.
వర్షాలు, వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి రూ. 10 వేల చొప్పున పంట నష్ట పరిహరం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయలని ఆదేశించారు.
కంటింజెన్సీ ఫండ్ కింద ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
రాష్ట్రంలోనే కాకుండా, జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు 24 గంటలు పని చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, వెంటనే క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని చెప్పారు.
ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, నిత్యావసర వస్తువుల పంపిణీ,, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.
భారీ వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టంపై అన్ని విభాగాల నుంచి ప్రాథమిక నివేదికలు తెప్పించి, కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సాయం కోరేందుకు నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో జరిగిన ఈ ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాయాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వ అధికార బృందాలతో పాటు స్వయంగా ప్రధాన మంత్రి ఈ విపత్తును పరిశీలించేందుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.