BIKKI NEWS (OCT. 04) : PADDY BUYING WITH 500 RUPEES BONUS. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు కనీస మద్దతు ధర (MSP) కు అదనంగా ఒక్కో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని స్పష్టం చేశారు.
PADDY BUYING WITH 500 RUPEES BONUS.
ఖరీఫ్ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సీతక్క గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ధాన్యం సేకరణకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అనేక సూచనలు చేశారు.
ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోపే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పగా, అవసరమైన చోట కలెక్టర్లు అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
ప్రస్తుత సీజన్ లో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
సన్న వడ్లకు బోనస్ ఇవ్వటం ఇదే మొదటిసారి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు, తప్పులు జరగకుండా జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి.
ప్రతి కేంద్రానికి ఒక నెంబర్ కేటాయించి, ఆ కేంద్రంలో కొనుగోలు చేసిన వడ్ల సంచులపైన ఆ నెంబర్ తప్పకుండా వేయాలి.
తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసే వారిని ఉపేక్షించరాదు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ధాన్యం సేకరణ ప్రక్రియలో పాల్గొనాలి.
కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు, టార్ఫాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
సమస్యల పరిష్కారానికి పౌర సరఫరాల శాఖ విభాగంలో 24X7 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి.