RYTHU BHAROSA – సాగు చేసే వారికే రైతు భరోసా.! – మంత్రి తుమ్మల

BIKKI NEWS (JUNE 15) : RYTHU BHAROSA FOR ONLY FARMING LANDS. రైతు భరోసా పథకం కింద అర్హులకే పెట్టుబడి సాయం అందించాల్సి ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. త్వరలోనే రైతు సంఘాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు స్వీకరించి, శాసనసభలో చర్చించి విధివిధానాలు రూపొందిస్తామని స్పష్టంచేశారు.

ఖమ్మంలో శుక్రవారం జరిగిన జడ్పీ సమావేశంలో రైతు భరోసా పథకంపై పలువురు సభ్యులు లేవనెత్తిన సందేహాలను మంత్రి నివృత్తి చేశారు. ‘గత ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందించింది. అందులో పంటలు సాగు చేయని వారికి కూడా డబ్బు ఇవ్వటంతో ఈ పథకం దుర్వినియోగమైందనే భావన ప్రజల్లో ఏర్పడింది. అందుకే సాగు చేసే వారికే పెట్టుబడి సాయం అందించాలని మా ప్రభుత్వం యోచిస్తోంది. రైతుభరోసా పథకం అమలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు.

అలాగే పంటల బీమా పథకం సైతం అర్హులకే వర్తించేలా రూపకల్పన చేస్తాం. బీమా ప్రీమియం సొమ్ము ప్రభుత్వమే చెల్లిస్తుంది. నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందేలా నిబంధనలను సరళతరం చేస్తాం.

రూ.2 లక్షల చొప్పున పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు. విడతల వారీగా మాఫీ చేయటం వల్ల ఆ సొమ్ము వడ్డీకే సరిపోతుందనే భావన రైతుల్లో ఉంది. ఈ అంశంపైనా త్వరలో విధివిధానాలు రూపొందిస్తాం. వీటన్నింటిపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇస్తుంది. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల పంట రుణమాఫీ అమలుకు కట్టుబడి ఉన్నాం.

రాష్ట్రంలో పత్తి విత్తనాలకు కొరత లేదు. కంపెనీలపై ఒత్తిడి పెంచి తగినన్ని విత్తనాలను జిల్లాలకు పంపించాం. అందరూ ఒకే రకం విత్తనం కావాలనటం వల్ల సమస్య ఏర్పడుతోంది. అన్ని కంపెనీల విత్తనాలు ఒకే విధంగా దిగుబడి ఇస్తాయి. నాణ్యతను పరీక్షించి కొనుగోలు చేయాలి. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు’ అని మంత్రి సూచించారు.

RYTHU BHAROSA FOR ONLY FARMING LANDS

LATEST CURRENT AFFAIRS

FOLLOW US @TELEGRAM