హైదరాబాద్ (ఎప్రిల్ – 11) : తెలంగాణ సాంఘిక సంక్షమ, గిరిజన సంక్షమ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ లలో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన COE CET – 2023 ఫలితాలను మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్ కలిసి విడుదల చేశారు. ప్రతిష్టాత్మకంగా నడిచే ప్రతిభా కళాశాలల్లో ప్రవేశాలకు గాను మార్చి 12న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షకు 13,573 మంది విద్యార్థులు హాజరు కాగా, 1,140 మంది సీట్లు పొందినట్లు తెలిపారు.
ఎంపీసీ కోర్సుల్లో బాలురు, బాలికలు కలిపి 575 మంది సీటు సాధించారు, బైపీసీ కోర్సుల్లో 565 మంది విద్యార్థులు సీట్లు పొందడం జరిగిందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఎంపీసీ కేటగిరిలో రమావత్ అరుణ్ 116 మార్కులతో మొదటి స్థానంలో నిలవగా, ఏ శ్రవణ్ కుమార్ 109 మార్కులతో రెండవ స్థానంలో నిలిచాడు. మూడవ స్థానంలో లకావత్ అశోక్ 107 మార్కులు సంపాదించాడు.
బైపీసీ కేటగిరిలో పత్లావత్ సందీప్, బానోత్ జయశ్రీ 117 మార్కులతో మొదటి రెండు స్థానాలు కైవసం చేసుకోగా, బానోత్ దిలీప్ 112 మార్కులతో మూడవ స్థానం దక్కించుకున్నాడు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి కృషిచేసిన అధికారులను ఉపాధ్యాయులను సిబ్బందిని మంత్రి అభినందించారు.