GURUKULA JOBS : రెండు స్థాయిలలో జనరల్ స్టడీస్ పేపర్

హైదరాబాద్ (జూన్ 30) : తెలంగాణ సంక్షేమ గురుకులాల్లోని జేఎల్, పీజీటీ పరీక్షలోని పేపర్-1 జనరల్ స్టడీస్, పేపర్-2 పై తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (TREI RB) స్పష్టత ఇచ్చింది.

పేపర్-1 జనరల్ స్టడీస్ ను రెండు స్థాయిల్లో నిర్వహించనున్నట్టు తెలిపింది. డీఎల్, జేఎల్, లైబ్రేరియన్, పీడీ, పీజీటీ పోస్టులకు పీజీ స్థాయిలో, టీజీటీ, స్కూల్ లైబ్రేరియన్, పీడీ పోస్టులకు యూజీ స్థాయిలో పరీక్షలుంటాయని వివరించింది.

పాఠ్యాంశాలు, అంశాల వారీగా పీజీ స్థాయిలో 3 గ్రూపులుగా, యూజీ స్థాయిలో 4 గ్రూపులుగా విభజించి పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అదేవిధంగా, ఆయా గ్రూపుల్లో సబ్జెక్టుల వారీగా అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నది.

పీజీటీ, జేఎల్ పేపర్-2ను (పెడగాజి) సబ్జెక్టుల వారీగా కామన్ గా నిర్వహించనున్నట్టు ట్రిబ్ వివరించింది.

ఉదాహరణకు ఒక అభ్యర్థి దరఖాస్తు చేసుకొన్న పోస్టులన్నీ ఒకే గ్రూపులో ఉన్నట్టయితే సదరు అభ్యర్థి పేపర్-1ను ఒకేసారి రాయాల్సి ఉంటుందని, దరఖాస్తు చేసుకున్న పోస్టులు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నట్టయితే సదరు అభ్యర్థి అందుకు అనుగుణంగా రెండు సార్లు పేపర్-1 రాయాలని ట్రిబ్ స్పష్టం చేసింది.