హైదరాబాద్ (జనవరి – 27) : తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, పదోన్నతులకు నేటి నుండి తెర లేవనుంది. మొత్తం 37 రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈరోజు టీచర్ల సీనియారిటీ జాబితాను విడుదల చేయనున్నారు.
2015 జులైలో చివరిసారిగా పదోన్నతులు, బదిలీలు ఒకేసారి జరపగా… మళ్లీ ఏడున్నర సంవత్సరాల తర్వాత ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 2018లో బదిలీలు మాత్రమే చేశారు.ఈసారి మొత్తం 9,700 మందికి పదోన్నతులు దక్కనున్నాయి. మరో 30 వేల మంది బదిలీ కానున్నారు.
★ ప్రధానోపాధ్యాయుల ఖాళీల వివరాలు :
మల్టీ జోన్-1లోని 19 జిల్లాల్లో 2,420 మంది హెచ్ ఎంలు ఉండాలి. అందులో 1096 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మల్టీ జోన్-2లో 14 జిల్లాలు ఉండగా అందులో ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో కలిపి మొత్తం హెచ్ఎం మంజూరు పోస్టులు 1,966. అందులో 906 ఖాళీగా ఉన్నాయి. వీటిని ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారికి పదోన్నతులు ఇచ్చి భర్తీ చేస్తారు.
★ 317 జీఓ ఉపాధ్యాయులకు నిరాశే
గత ఏడాది జనవరిలో 317 జీఓ ద్వారా కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయులను కేటాయించారు. ఆ క్రమంలో దాదాపు 25 వేల మంది ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ అయ్యారు. బదిలీకి కనీస స్టేషన్ సర్వీస్ రెండేళ్లు కాకుండా జీరో సర్వీస్ తో 317 జీఓ బాధితులకు కూడా దరఖాస్తుకు అవకాశం కల్పించాలని పలు సంఘాలు విద్యాశాఖకు విన్నవించినా పట్టించుకోలేదు. దాంతో ఇప్పటివరకు ఉన్న ఆశ ఆ ఉపాధ్యాయుల్లో ఆవిరైపోయింది. అందరికీ అవకాశం ఇస్తే మారుమూల పాఠశాలల్లో పనిచేసే వారు ఉండరని ప్రభుత్వం భావించినట్లు తెలిసింది. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు పనిచేసే చోటే ఉంటారని తెలిపిన ప్రభుత్వం వారికి అవకాశం కల్పించడం లేదు.
Follow Us @