- కేబినెట్ కీలక నిర్ణయం.. ఆర్ అండ్ బీ శాఖలో అదనంగా 472 పోస్టులు
- పోలీసుశాఖలో 3,996 ఉద్యోగాల మంజూరు
- బీసీ గురుకులాలో 2,591 పోస్టుల మంజూరు
- డీఈఈ నుంచి సీఈ వరకు స్వతంత్ర నిర్ణయాధికారానికి కేబినెట్ ఆమోదం
- కొత్త కార్యాలయాలు ఏర్పాటు
- రోడ్ల మరమ్మతులకు రూ. 1865 కోట్లు
హైదరాబాద్ (డిసెంబర్ – 10) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లు భవనాల శాఖలో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బీ శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది.
రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పలు రంగాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా రోడ్లు భవనాల శాఖలో పని విస్తృతి పెరుగుతున్నదని, అందుకు అనుగుణంగా శాఖలోని పలు విభాగాలను పటిష్టం చేయాలని, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
◆ రోడ్డు భవనాల శాఖలో అధికార వికేంద్రీకరణ..
రోడ్లు భవనాల శాఖలో అధికార వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన అదనపు ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, అవసరమైన మేరకు నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశించింది. అందుకోసం అదనపు నిధులను కూడా మంజూరు చేసింది. ఇందులో భాగంగా రోడ్లు భవనాల శాఖ చేసిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతే కాకుండా అత్యవసర సమయాల్లో అధికారులు స్వీయ నిర్ణయంతో ప్రజావసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు కేబినెట్ అవకాశమిచ్చింది.
◆ నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశం..
రోడ్లు భవనాల శాఖ లో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బీ శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది. ఇందులో… కొత్తగా 3 చీఫ్ ఇంజనీర్ పోస్టులు, 12 సూపరిండెంట్ ఇంజనీర్ పోస్టులు, 13 ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, 102 డీఈఈ పోస్టులు, 163 అసిస్టెంట్ ఈఈ పోస్టులు, 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. దాంతో పాటు సత్వరమే పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.
◆ కొత్త కార్యాలయాలు ఏర్పాటు
పెరిగిన నూతన ఉద్యోగాలతో పాటు, ఆర్ అండ్ బీ శాఖలో పరిపాలన బాధ్యతల వికేంద్రీకరణకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల నిర్మాణం, మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బీ శాఖ లోని, రోడ్లు, భవనాలు, ఎలక్ట్రికల్, జాతీయ రహదారుల విభాగాల్లో… 3 చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలను, 10 సర్కిల్ కార్యాలయాలను, 13 డివిజన్ కార్యాలయాలను, 79 సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి శాఖను కేబినెట్ ఆదేశించింది.
◆ రోడ్ల మరమ్మతులకు రూ. 1865 కోట్లు
అదే సందర్భంలో… రోడ్లు భవనాల శాఖను మరింత పటిష్ట పరిచేందుకు ప్రజావసరాల దృష్ట్యా పనులు చేపట్టేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి అదనంగా నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా.. కాలానుగుణంగా చేపట్టే రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1865 కోట్లను మంజూరు చేసింది. వానలు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా రోడ్లు తెగిపోవడం, కొట్టుకుపోవడం వంటి సందర్భాల్లో ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచే దిశగా తక్షణమే పనులు చేపట్టేందుకు గాను.. రూ. 635 కోట్ల నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
◆ డీఈఈ నుంచి సీఈ వరకు స్వతంత్ర నిర్ణయాధికారానికి కేబినెట్ ఆమోదం
వానలు వరదలు తదితర ప్రకృతి విపత్తుల సందర్భంలో, ప్రజావసరాలకు అనుగుణంగా, అసౌకర్యాన్ని తొలగించి యుద్దప్రాతిపదికన పనులు చేపట్టేందుకు వీలుగా కింది స్థాయి డీఈఈ నుంచి పైస్థాయి సీఈ వరకు స్వతంత్ర నిర్ణయాధికారానికి కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా… విచక్షణతో కూడిన స్వీయ నిర్ణయాలను తీసుకుని పనులు చేపట్టేందుకు డీఈఈకి ఒక్క పనికి రూ. 2 లక్షలు (సంవత్సరానికి రూ. 25 లక్షలు), ఈఈకి రూ. 25 లక్షల వరకు (ఏడాదికి రూ.1.5 కోట్లు), ఎస్ఈ పరిధిలో రూ. 50 లక్షలు (సంవత్సరానికి రూ. 2 కోట్లు), సీఈ పరిధిలో రూ. 1 కోటి వరకు (సంవత్సరానికి రూ. 3 కోట్ల వరకు) పనులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అత్యవసర సమయాల్లో ఈ పనులను అవసరమైతే నామినేషన్ పద్దతుల్లో చేపట్టేందుకు అధికారాలను కల్పించింది. ఇందుకోసం..ఏడాదికి రూ. 129 కోట్లు ఆర్ అండ్ బీ శాఖ ఖర్చు చేసేందుకు కేబినెట్ అవకాశం కల్పించింది.ఇదే పద్దతిని అనుసరిస్తూ.. భవనాల విభాగంలో కూడా అత్యవసర సమయాల్లో రిపేర్లు తదితర ప్రజావసరాల కోసం ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించింది. అత్యవసర పనులు చేపట్టేందుకు పరిమిత నిధులతో స్వీయ నిర్ణయాధికారాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు తగ్గట్టుగా నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.
◆ గురుకులాల్లో 2,591 ఉద్యోగాల మంజూరు
బీసీ సంక్షేమ శాఖలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లోని పలు విభాగాల్లో మొత్తం 2,591 నూతన ఉద్యోగాల నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించిన 4 జూనియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్ పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ విభాగాల్లో అవసరమైన మేరకు ఈ నూతన నియామకాలను చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది.
◆ పోలీసు శాఖలో 3,996 ఉద్యోగాల మంజూరు
తెలంగాణ పోలీస్ శాఖలో కొత్త పోస్టుల భర్తీకి తెలంగాణ మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. కొత్తగా 3,966 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయాలని, నియామకానికి చర్యలు చేపట్టాలని హోంశాఖను కేబినెట్ ఆదేశించింది. కొత్త పోలీస్ స్టేషన్లు, కొత్త సర్కిళ్లు, డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. డ్రగ్స్ నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Follow Us @