తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల నోషనల్ సర్వీస్ సమస్య పరిష్కారం చేసి, వేతన వ్యత్యాసాన్ని సవరించాలని PRTU మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (PMTA TS) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్, ప్రధాన కార్యదర్శి అనుముల పోచయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
194 తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు నాడు ప్రత్యేక డీఎస్సీ 2012 నోటిఫికేషన్ ద్వారా ఒకే సెలక్షన్ లిస్ట్ లో ఉండి, ఒకేసారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి కాబడినప్పటికీ నియామక ప్రక్రియ దశలవారీగా చేపట్టడం వలన సర్వీస్ కోల్పోవడం జరిగింది. దీని కారణంగా ఉపాధ్యాయుల వేతనాలలో భారీ వ్యత్యాసం ఏర్పడింది.
● అందని 10వ పీఆర్సీ ఫలాలు ::
దీని వలన పదవ పిఆర్సి 43% పిట్మెంట్ ను కూడా కోల్పోయి కేవలం 27 శాతం ఫిట్మెంట్ తోనే గత పిఆర్సీ కాలంలో వేతనాలు తీసుకోవడం 70 శాతం మంది ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులు నష్టపోయారు.
పిఆర్సి 2015 అమలు 2013 జూలై 1 లోపు 43% ఫిట్ మెంట్ ఇస్తూ జీవో విడుదల కావడం జరిగింది. కానీ ఇది కేవలం మొదటిదశలో నియమితులైన 30 శాతం మంది ఆదర్శ ఉపాధ్యాయులకు మాత్రమే వర్తించింది మిగతా 70 శాతం మంది ఉపాధ్యాయులకు కేవలం 27 శాతం మాత్రమే అమలు కావడం వలన వేతనాల మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది.
● సమస్య మూలం ::
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2012లో ప్రత్యేక డీఎస్సీ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన 355 ప్రిన్సిపాల్ పోస్టులు, 4615 పి జి టి పోస్ట్స్, 2130 టీజీజీ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు దశలవారీగా నియామకాలు చేపట్టడం జరిగింది.
- 2013 జూన్ లో మొదటి దశలో ప్రిన్సిపాల్ పోస్టులు, కొంతమంది పిజిటిలను నియమించారు.
- జూలై 2013 టిజీటీ, హిందీ పోస్టులను
- 2013 నవంబర్ లో టీజీటీ, తెలుగు, గణితం, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ పోస్టులను నింపడం జరిగింది. 2013 లో నింపిన పోస్టులు ఏ సబ్జెక్టు పోస్టులు కూడా పూర్తి స్థాయిలో నింపకుండా కొంత మంది తోనే తరగతులు నిర్వహించడం జరిగింది.
- 2014 జనవరిలో పీజీటీ తెలుగు రెండవ దశ నియామకాలను
- 2014 సెప్టెంబర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన అన్ని సబ్జెక్టుల పోస్టులను నియామకం జరిగింది.
ఈ విధంగా ఒకే నోటిఫికేషన్ ద్వారా ఒకేసారి నియమించాల్సిన ఉపాధ్యాయులను దాదాపు ఐదు దశల్లో నింపడం వలన ఉద్యోగ ప్రవేశ తేదీలలో వ్యత్యాసము ఏర్పడి వేతనాలలో భారీ వ్యత్యాసానికి కారణం అయ్యింది.
● 2008 & 2012 డియస్సీల నియమాకాలలో ఇలాంటి సమస్య పరిష్కారం.
గతంలో 2008 డియస్సి, 2012 డియస్సి లలో ఇదే విధంగా దశలవారీగా నియామకాలు చేపట్టడం వలన వారు కూడా ఆనాటి పిఆర్సి ఫిట్ మెంట్ కోల్పోవడం జరిగింది. వారికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్థాయిలోనే నోషనల్ సర్వీస్ కల్పించడం జరిగింది. మరియు వారికి పిఆర్సి ఫిట్ మెంట్ వర్తింపజేయడం జరిగింది. కాని మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల ఇదే సమస్యకు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఉపాధ్యాయులు ఆవేదనకు గురి అవుతున్నారని తరాల జగధీష్ తెలిపారు.
● పలుమార్లు ప్రభుత్వం దృష్టికి ::
ఓకే నియామక నోటిఫికేషన్ ద్వారా నియమించబడినప్పటికీ బేసిక్ పే లో 8వేల రూపాయల వ్యత్యాసంతో గత ఏడు సంవత్సరాలుగా పని చేయాల్సి రావడం వలన ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను వివిధ రూపాలలో వివిధ సందర్భాలలో సంఘం తరఫున తీసుకెళ్తున్నప్పటికీ ప్రభుత్వం మరియు అధికార వర్గాలు సమస్య పరిష్కారం పట్ల నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం గమనార్హం
● సమస్య పరిష్కారానికి అలుపెరుగని పోరాటం
ఈ సమస్య మీద గత ఆరు సంవత్సరాలుగా PRTU మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ( PMTA TS) సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులను, వివిధ స్థాయి అధికారులను కలిసి ఈ సమస్య పరిష్కరించవలసిందిగా కోరుతున్నా పరిష్కారం కాకపోవడం గమనార్హం. అతి చిన్న సమస్య అయినా నోషనల్ సర్వీస్ పరిష్కరించడానికి ఏళ్ల తరబడి సమయం పట్టడం ఆశ్చర్యం. ఈ 11వ పిఆర్సి లో నైనా ఈ నోషనల్ సర్వీస్ సమస్యను పరిష్కరించి అందరికీ సమాన వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తరాల జగదీశ్ విజ్ఞప్తి చేశారు.
Follow Us @