జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా అస్నాల శ్రీనివాస్ ప్రత్యేక వ్యాసం


BIKKI NEWS : విద్యాపరమైన అసమానతలు వైద్య సేవల లభ్యతలోను, అభివృద్ధి ఫలాలు అందుకోవడంలోను, న్యాయ పరిపాలనా హక్కులు పొందడంలోను అసమానతలకు దారితీస్తాయి. సమాజం మరింత విభజనకులోనై సామాజిక అశాంతి నెలకొనే ప్రమాదమున్నది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామికవాదులు, మేధావులు సమష్టిగా ఆజాద్‌ దార్శనికతను అమలు చేయడం కోసం కృషి చేయాలి. (national-education-day-essay-by-asnala-srinivas)

మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ దేశానికి అందించిన గొప్ప సేవలకు గౌరవార్ధం ఆజాద్‌ జన్మదినం నవంబర్‌ 11ను దేశం ‘జాతీయ విద్యా దినోత్సవం’గా జరుపుకుంటున్నది. – అస్నాల శ్రీనివాస్ : టిజిఓ ఇంటర్ విద్య

జాతీయోద్యమ కాలంలో రాజకీయ విప్లవం సామాజిక విప్లవం సమాంతరంగా నడిచాయి. స్వాతంత్య్రం లభించడంతో రాజకీయ విప్లవం ముగిసింది. కాని సామాజిక విప్లవాన్ని సమగ్రత వైపు నడిపించడంలోనే, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఆర్థిక విప్లవాన్ని శీఘ్రతరం చేయడంలోనే భారతదేశ భవిష్యత్‌ ఆధారపడి ఉందని, ప్రపంచంలో ఒక శక్తిమంతమైన దేశంగా రూపుదిద్దుకుంటుందనే సత్యాన్ని స్వాతంత్య్రానంతరం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పాలకులు గుర్తించారు. విలువలతో కూడిన లౌకిక విద్యలను అభివృద్ధి పరచి, ఆలోచనల్లో మాటల్లో, చేతల్లో, ఉన్నతమైన అభిప్రాయాలను ఏర్పరచి వ్యక్తి గౌరవానికి, విలువను కలుగచేయడం ద్వారా సామాజిక విప్లవాన్ని, శాస్త్ర సాంకేతిక, వైజ్ఞానిక విద్య ద్వారా ప్రాచీన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రణాళికబద్దమైన వ్యవసాయక పారిశ్రామిక వ్యవస్థగా మార్చడానికి, సంపదను వికేంద్రీకరించి ప్రజల జీవన విధానంలో మార్పు తేవడానికి ఆర్థిక విప్లవాన్ని అమలు చేసే కృషిలో అగ్రగామిగా పని చేసిన స్వాతంత్ర్యోద్యమ నేత, కవి, జర్నలిస్టు, చింతనాపరుడు, స్వతంత్ర భారత తొలి విద్యాశాఖామంత్రి భారతరత్న ‘మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌’.

అందరికి ఒకే రకమైన విద్యను ప్రసాదించే ఉమ్మడి విద్యావ్యవస్థను నిర్మించినప్పుడు శాంతి, న్యాయం స్వేచ్ఛ, సమానత్వం విలువలతో ఏర్పడే ప్రజాతంత్రవ్యవస్థలో ప్రజలందరు సుఖంగా జీవించగల్గుతారు. – అస్నాల శ్రీనివాస్

1888 నవంబర్‌ 11న సౌది అరేబియా లోని మక్కాలో భారతీయ ఇస్లామిక్‌ సంపన్న కుటుంబంలో జన్మించిన ఆజాద్‌ బెంగాల్‌ విప్లవకారుల ప్రేరణతో 1920-– 1946 వరకు జాతియోద్యమ అగ్రనేతగా గాంధీ నెహ్రులతో కలిసి పనిచేసారు. ఉద్యమక్రమంలో లౌకిక, జాతీయ సమగ్రత విలువలకు కట్టుబడి పని చేసారు. దేశవిభజనను వ్యతిరేకించారు. ఖిలాఫత్‌, శాసనోల్లంఘన, క్విట్‌ ఇండియా ఉద్యమ నిర్మాణంలో క్రియాశీల పాత్ర పోషించారు. 35 సంవత్సరాల వయస్సులోనే 1923 ఢిల్లీ జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో అధ్యక్షునిగా ఎంపికై భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే స్వతంత్ర భారత్‌ సాధనే లక్ష్యంగా ప్రకటించి ఆ వెలుగులో పనిచేసి పదకొండు సంవత్సరాలు జైలు జీవితం గడిపి వలస పాలన విముక్తి పోరాటంలో చిరస్మరణీయ పాత్ర పోషించాడు.

35 సంవత్సరాల వయస్సులోనే 1923 ఢిల్లీ జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో అధ్యక్షునిగా ఎంపికై భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే స్వతంత్ర భారత్‌ సాధనే లక్ష్యంగా ప్రకటించి ఆ వెలుగులో పనిచేసి పదకొండు సంవత్సరాలు జైలు జీవితం గడిపి వలస పాలన విముక్తి పోరాటంలో చిరస్మరణీయ పాత్ర పోషించాడు. అస్నాల శ్రీనివాస్

కవిగా, సాహితీవేత్తగా తన పన్నెండవ ఏట నుండి ప్రస్థానాన్ని ప్రారంభించి 1945 వరకు కొనసాగించాడు. స్వాతంత్ర్యోద్యమ భావజాల ప్రచారం కోసము ‘ఆల్‌హిలాల్‌’ పత్రికను నడిపాడు. టజ్కిరా, టప్సీర్‌-ఈ-ఖురాన్‌, గుబార్‌-ఈ-ఖదీర్‌ వంటి సాహితి సంకలనాలను వెలువరించాడు. జర్నలిస్టుగా సంస్కరణోద్యమ దృక్పథంతో పనిచేసిన వకీల్‌, జమిందార్‌, ముస్లింగెజిట్‌, పైసా, అక్బర్‌, మాషిరిక్‌, అల్‌మరీనీ, ముసల్మాన్‌, ఆల్‌హక్‌, హమ్‌రార్డ్‌, కామ్రేడ్‌ వంటి పత్రికలలో పని చేసాడు.

1947 నుంచి 1958 వరకు కేంద్రంలో విద్యా, వనరుల శాఖమంత్రిగా పనిచేసారు. వలసవాద అవసరాలకు రూపొందించిన విద్యావ్యస్థను సమూలంగా ప్రక్షాళన చేసి దేశీయ అవసరాలకు అనువైన విప్లవాత్మక విద్యాసంస్కరణలను అమలు చేసాడు. – అస్నాల శ్రీనివాస్

1947 నుంచి 1958 వరకు కేంద్రంలో విద్యా, వనరుల శాఖమంత్రిగా పనిచేసారు. వలసవాద అవసరాలకు రూపొందించిన విద్యావ్యస్థను సమూలంగా ప్రక్షాళన చేసి దేశీయ అవసరాలకు అనువైన విప్లవాత్మక విద్యాసంస్కరణలను అమలు చేసాడు. అందరికి ప్రమాణాలతో, నాణ్యతతో కూడిన సామాజిక విద్యను అమలు చేయడం ద్వారా ప్రజల మధ్య ఉన్న సామాజిక వైరుధ్యాలను, ఆర్థిక అసమానతలను తొలగించగలమని, బహుళత్వం గల భారతీయ సమాజంలో సౌభ్రాతృత్వం, పరస్పర అవగాహన, సహజీవనం వెల్లివిరుస్తుందని తద్వారా నవభారతం నిర్మితమవుతుందని విశ్వసించి ఈ వెలుగులోనే భారతీయ విద్యా వికాసాన్ని స్వల్పకాలంలో పురోగమనం వైపు నడిపించాడు. విద్యా మంత్రిగా పనిచేసిన కాలంలో యూనివర్సిటి గ్రాంట్స్‌ కమిషన్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజి, ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ ఇండస్ట్రియల్‌ రెసెర్చ్‌, వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో, భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి వంటి అనేక విద్యా సంస్థలను ప్రారంభించాడు. హిందీని జాతీయ భాషగా పకటించడానికి ఏకాభిప్రాయం తీసుకురావడంలో క్రమశిక్షణను నేర్పించే వ్యాయామ విద్యను, క్షేత్రస్థాయి జ్ఞానం కోసము విజ్ఞాన విహారయాత్రలను, మానసిక, శారీరక దివ్యాంగుల కోసం ప్రత్యేక పాఠశాలలను, ఇంకా అనేక సామాజిక సేవా దృక్పథంతో విద్యా సంస్థలను స్థాపించి ఆధునిక భారతీయ విద్యా విప్లవానికి చక్కని పునాదితో ఆరంభాన్ని ఇచ్చాడు. సాహిత్య, సాంస్కృతిక వికాసం కోసం సంగీత, సాహిత్య, నాటక కళల అకాడమిలను స్థాపించాడు. జాతీయోద్యమ నేత జె.బి. కృపలాని మాటల్లో ‘మౌలానా ఆజాద్‌ బహుముఖ ప్రజ్ఞత ఉన్న చారిత్రక వ్యక్తి, అంతకన్న ఎక్కువగా శ్రేయోదృక్పథంలో చరిత్రను నడిపించినవారు’ దేశానికి అందించిన గొప్ప సేవలకు గౌరవార్ధం ఆజాద్‌ జన్మదినం నవంబర్‌ 11ను దేశం ‘జాతీయ విద్యా దినోత్సవం’గా జరుపుకుంటున్నది.

విద్యా మంత్రిగా పనిచేసిన కాలంలో యూనివర్సిటి గ్రాంట్స్‌ కమిషన్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజి, ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ ఇండస్ట్రియల్‌ రెసెర్చ్‌, వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో, భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి వంటి అనేక విద్యా సంస్థలను ప్రారంభించాడు. – అస్నాల శ్రీనివాస్

ప్రస్తుత దేశ విద్యావ్యవస్థ తీరుతెన్నులను పరిశీలిస్తే స్వాతంత్ర్యోద్యమ ఆకాంక్షలకు భిన్నమైన, రాజ్యాంగ విద్యుక్త ధర్మంను ఉల్లంఘిస్తున్న ఆందోళన స్థితి నెలకొని ఉన్నది. విద్యా వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని విద్యపై వ్యయాన్ని ప్రజల భవిష్యత్‌ కోసం పెట్టుబడిగా భావించాలనే ఆదర్శం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నది. గత నాలుగేండ్ల నుండి ఇది అంతరించే స్థితికి చేరుకొని ప్రజా విద్యావ్యవస్థ మనుగడకు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. పక్క ప్రణాళికతో ప్రజాస్వామిక వ్యవస్థలను బలహీనం చేస్తున్న మోడి ప్రభుత్వం ఉన్నత విద్యలో విమర్శనాత్మక ఆలోచన, స్వతంత్ర నిర్ణయాలు చేయగలిగిన శక్తి, స్వయం ప్రతిపత్తి కోసం ఏర్పాటు చేసిన యూనివర్సిటి గ్రాంట్స్‌ కమిషన్‌ పేరును హైయర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చారు. క్రమేణ ఉన్నత విద్య నుంచి ప్రభుత్వం వైదొలగడం కోసము, నిధులపై ఆధారపడకుండా చేసి ఫీజులను పెంచడం, పేదలకు ఉన్నత విద్యను దూరం చేయడం, ప్రవేటీకరణ శక్తుల ప్రయోజనాల కోసమే యుజిసి పేరును మార్చారని అఖిల భారత విశ్వవిద్యాలయ టీచర్ల సంఘం తన నిరసనను తెలియజేసింది.

ప్రాచీన కాలం నుండి భారతీయుల జీవన విధానంగా ఉన్న సర్వమత సహజీవన స్ఫూర్తికి విఘాతం కల్గించేలా విద్యా సంస్కరణల పేరుతో చరిత్రను వక్రీకరించి మతతత్వంతో పాఠ్యపుస్తకాలను తిరగరాస్తున్నారు. మానవ నాగరికత వికాసం కోసం శారీరక, మేధోశ్రమలతో ఆపూర్వ ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తల కృషిని ఆపహాస్యం చేస్తూ, మతాన్ని విద్యా వ్యవస్థలో మిళితం చేయడం ద్వారా శాస్త్రీయ అవగాహన, ప్రశ్నించే హక్కులను హరింపచేస్తూ విద్యారంగంపు లౌకిక, ప్రజాతంత్ర పునాదులను కదిలిస్తున్నారు. విద్యాపరమైన అసమానతలు ఇతర రంగాలలో కూడ అనగా వైద్య సేవల లభ్యత, అభివృద్ధి ఫలాలు అందుకోవడం, న్యాయ పరిపాలనా హక్కులు పొందడంలో అసమానతలకు దారితీస్తాయి. దీనితో సమాజం మరింత విభజనకు లోనై సామాజిక అశాంతి నెలకొనే ప్రమాదస్థితికి దేశం నెట్టివేయబడింది. ఈ నేపథ్యంలో ప్రజల సహకారంతో ప్రజాస్వామికవాదులు, మేధావులు సమిష్ఠిగా, జాతీయోద్యమ ఆకాంక్షలు, ఆజాద్‌ దార్శనికతను అమలు చేయడం కోసం కృషి చేయాలి. అందరికి ఒకే రకమైన విద్యను ప్రసాదించే ఉమ్మడి విద్యావ్యవస్థను నిర్మించినప్పుడు శాంతి, న్యాయం స్వేచ్ఛ, సమానత్వం విలువలతో ఏర్పడే ప్రజాతంత్రవ్యవస్థలో ప్రజలందరు సుఖంగా జీవించగల్గుతారు.

అస్నాల శ్రీనివాస్‌
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం
(నేడు ఆజాద్‌ జయంతి,భారతీయ విద్య దినోత్సవం)
9652275560