పోస్టింగ్లు లేకుండా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు జీతాలు ఎందుకని, ప్రభుత్వ అధికారులను ఖాళీగా ఉంచడం వల్ల ప్రజాధనానికి తీవ్రనష్టం వాటిల్లుతోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. పోస్టింగ్లు లేకుండా ఎంతమంది అధికారులు ఖాళీగా ఉన్నారో వచ్చే విచారణ సమయంలోగా జాబితా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
ఈ అంశంపై బొందిలి నాగధర్ సింగ్ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ అభినందన్కుమార్ షావిలి నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.వెంకన్న వాదనలు వినిపిస్తూ…. ప్రజాధనం వృథాను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని పేర్కొన్నారు. అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా ప్రభుత్వం వెయిటింగ్ జాబితాలో ఉంచుతుందని, తద్వారా తన ఉత్తర్వులను తానే ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు.
వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. పోస్టింగ్లు లేకుండా వెయింటింగ్ జాబితాలో ఉన్న అధికారుల జాబితా సమర్పించాలని.. వారి సేవలను వినియోగించుకోవడానికి తీసుకున్న చర్యలు వివరించాలని పేర్కొంది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.
source : abn
Follow Us @