AP JOB ALERT : గ్రూప్ 2, 3 ఉద్యోగాలకు ఇకపై అర్హత పరీక్ష

విజయవాడ (ఫిబ్రవరి – 25) : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహించే గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామకానికి అర్హత పరీక్షగా ఇకపై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు (CPT) సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఆర్హత పరీక్షను ఏపీపీఎస్సీ, ఏపీ సాంకేతిక విద్యా మండలి నిర్వహించనుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా సీపీటీ పాస్ కావాల్సిందేనని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.

100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో SC, ST, దివ్యాంగ అభ్యర్థులు 30 మార్కులు, బీసీలు 35, ఓసీలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది. కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్, ఇంటర్నెట్ తదితర అంశాల్లో పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రూపు-1 ఉద్యోగాలకు ఈ తాత్కాలిక నిబంధనలు వర్తించవంటూ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.