న్యూడిల్లీ (డిసెంబర్ – 29) : “భారత వాయుసేన సుఖోయ్ – 30MKI యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా ఛేదించింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఉపరితలం, సముద్ర మార్గంలో సుదూర లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం వైమానిక దళానికి లభించినట్టయింది” అని రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
సుఖోయ్-30 యుద్ధ విమానం బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ రేంజ్ క్షిపణిని గురువారం బంగాళాఖాతంలో పరీక్షించారు. బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతమై 400 కి.మీ. దూరంలో ఉన్న నౌకను పేల్చేసింది.
భారత వాయుసేన, నావికాదళం, డిఫెన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్ డీఓ), హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్), బ్రహ్మోస్ ఏరోస్పేస్ (బీఏపీఎల్) సంయుక్తంగా చేసిన కృషితో ఈ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని పేర్కొంది. యుద్ధ విమానం నుంచి సుఖోయ్ ప్రయోగించడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది మేలో సూపర్ సోనిక్ మిస్సైల్ ఎక్స్టెండెండ్ వెర్షన్ ను సుఖోయ్ యుద్ధ విమానం నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఇప్పుడు క్షిపణి పరిధిని 290 కిలోమీటర్ల స్థాయి నుంచి 400 కిలోమీటర్లకు పెంచారు.