జాతీయ విద్యావిధానంలో చేసిన ప్రతిపాదనలను అమలుచేసేలా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్ క్లాసులను కూడా బోధించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఇబ్బంది కలుగకుండా హై స్కూల్స్ లో జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రెండు లేదా మూడు మండలాలను ఒక క్లస్టర్గా ఏర్పాటుచేసి ఒక హైస్కూల్లో ఇంటర్ తరగతులను నిర్వహించనున్నారు.
జాతీయ విద్యావిధానంలో చేసిన ప్రతిపాదనలను అమలుచేసేలా ఈ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వీలైతే 2021-22 విద్యాసంవత్సరం నుంచి స్కూళ్లకు జూనియర్ కాలేజీల హోదా కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. 10+2 విధానాన్ని అనుసరించడం వల్ల విద్యార్థుల డ్రాపౌట్స్ శాతం గణనీయంగా తగ్గుతుందని, విద్యార్థులంతా ఇంటర్ వరకు చదువుకొనే వీలు కలుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
★ కొత్తగా 7వేల లెక్చరర్ల పోస్టులు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.
ఒక్కో కాలేజీకి కనీసం ఏడుగురు లెక్చరర్లు అవసరం. అలా వెయ్యి జూనియర్ కాలేజీలకు కలిపి 7వేల లెక్చరర్ల పోస్టులు కొత్తగా ఏర్పడుతాయి. ఆ పోస్టుల్లో పదోన్నతుల ద్వారా 70 శాతం పోస్టులను, మిగిలిన 30 శాతం (2,100) పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు.